రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళగిరిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జాతీయ డీవార్మింగ్ డే – ఫిబ్రవరి 2026 సందర్భంగా రూపొందించిన AI వీడియోను విడుదల చేశారు. పిల్లల ఆరోగ్యంపై పురుగుల ప్రభావం, పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమం
ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 17-02-2026న జాతీయ డీవార్మింగ్ డేను నిర్వహించనున్నారు. మొత్తం 1.11 కోట్ల మంది పిల్లల లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నారు. వీరిలో 1–5 ఏళ్ల వయసు గల 24 లక్షల మంది పిల్లలు (అంగన్వాడీలు, స్కూల్కు వెళ్లని పిల్లలు) మరియు 6–19 ఏళ్ల వయసు గల 87 లక్షల మంది పిల్లలు (పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, ఐటీఐ, నర్సింగ్ కాలేజీలు) ఉన్నారు.
డీవార్మింగ్ కోసం అవసరమైన అల్బెండాజోల్ మాత్రం జిల్లాలకు పంపించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు ప్రజల్లో అవగాహన పెంచేందుకు AI వీడియోలు, పోస్టర్లు, రేడియో జింగిల్స్ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయుల సమన్వయంతో అర్హులైన పిల్లలకు మాత్రలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

